ప్రధాని పర్యటన ద్వారా ప్రపంచ వ్యాప్తంగా కర్నూలుకు గుర్తింపు
- రాష్ట్ర మంత్రి టీజీ భరత్
- మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి టీజీ భరత్
కర్నూలు : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన ద్వారా కర్నూలుకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, ఇతర నాయకులతో కలిసి మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ప్రధానమంత్రి కర్నూలు జిల్లా పర్యటన విజయవంతంగా ముగిసిందన్నారు. ఈ సభ విజయవంతానికి కారకులైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా ఈ బహిరంగ సభకు హాజరైన అశేష ప్రజానీకానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనంతపూర్, కర్నూలును ఇండస్ట్రియల్ కారిడార్ చేసేందుకు కృషి చేస్తున్నారన్నారు. ప్రధాని పర్యటన తర్వాత ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్కుకు మరిన్ని పెట్టుబడులు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక సామాజిక మాద్యమాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు.. ప్రధానమంత్రికి వినతి పత్రాలు ఇచ్చారని, వారి వినతిపత్రాలకు ప్రధానమంత్రి స్పందించారని జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి తీవ్రంగా ఖండించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేసుకోవడం జరుగుతుందన్నారు. గత ఎన్నికల్లో ఆ పార్టీని ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసినా ఇంకా ఆ పార్టీ నాయకులకు బుద్ధి రాలేదని, వారు ఇలాంటి వైఖరి మానుకోకపోతే రానున్న ఎన్నికల్లో అవి కూడా మిగిలే పరిస్థితి ఉండదని చెప్పారు.



Post Comment