*1100 కాల్ సెంటర్, ఆన్లైన్ సేవలను వినియోగించుకోవాలి*
*జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా వెల్లడి*
రాజధాని వాయిస్:పిబ్రవరి 15,నరసరావుపేట.
జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటలు నుంచి మధ్యాహ్నం 2 గంట వరకు కలెక్టరేట్ లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ సమస్య గురించి ఖచ్చితమైన మరియు పూర్తి వివరాలతో దరఖాస్తు చేయాలని సూచించారు. అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరిస్తారని తెలిపారు.
*అర్జీదారులు గమనించాల్సినవి:* సమస్యకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అర్జీని సమర్పించాలి. గతంలో ఫిర్యాదు చేసిన వారు తప్పనిసరిగా పాత అర్జీ రసీదు తీసుకురావాలని సూచించారు. అర్జీలో పేరు, చిరునామా మరియు ఫోన్ నంబర్ స్పష్టంగా నమోదు చేయాలని తెలిపారు.
*డిజిటల్ పర్యవేక్షణ:* అర్జీదారులు తమ ఫిర్యాదు స్థితిగతులను తెలుసుకునేందుకు ప్రభుత్వం కింది సౌకర్యాలను కల్పించిందని కలెక్టర్ వివరించారు: SMS అలర్ట్: సమస్య పరిష్కారమైన వెంటనే అర్జీదారుని ఫోన్ నంబర్కు మెసేజ్ వస్తుంది. వాట్సాప్ & పోస్ట్: నోటీసులు, ఎండార్స్మెంట్లు వాట్సాప్ ద్వారా పంపడంతో పాటు, రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఇంటి చిరునామాకు కూడా పంపిస్తారు.
*మున్సిపల్/మండల స్థాయిలో:* జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాల్లో కూడా పీజీఆర్ఎస్ జరుగుతుంది. ప్రజలు తమ సమీప కేంద్రాల్లో ఫిర్యాదు చేయవచ్చు.
*’మీ కోసం’ 1100 కాల్ సెంటర్:* అర్జీదారులు కలెక్టరేట్కు రాకుండానే తమ సమస్యలను నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం కల్పించిన 1100 టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించ వచ్చునని కలెక్టర్ సూచించారు. గతంలో ఇచ్చిన అర్జీల స్టేటస్ తెలుసుకోవడానికి కూడా ఈ నంబర్కు కాల్ చేయవచ్చునని, అలాగే, meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో కూడా అర్జీలను సమర్పించవచ్చునని సూచించారు. జిల్లా ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ సమస్యలకు సత్వర పరిష్కారం పొందాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ……………. *ప్రతి సోమవారం రెవెన్యూ క్లినిక్*
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ప్రతి సోమవారం ఉదయం 10.00 గంటలకు రెవెన్యూ క్లినిక్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా తెలిపారు.
ముగ్గురు రెవెన్యూ డివిజనల్ అధికారులు, మండల తహసీల్దార్లు తప్పనిసరిగా ఉదయం 10.00 గంటలకు కలెక్టరేట్లో నిర్వహించే రెవెన్యూ క్లినిక్కు హాజరై వినతులను స్వీకరిస్తారని తెలిపారు. అలాగే ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరించేందుకు సంబంధిత ఏఓ, డీటీ లు అందుబాటులో ఉంటారని తెలిపారు. తహసీల్దార్ కార్యాలయాల్లో నిర్వహించే రెవెన్యూ క్లినిక్కు మండల సర్వేయర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, గ్రామ రెవెన్యూ అధికారులు తమకు సంబంధించిన అన్ని రికార్డులతో తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. రైతులు మరియు ప్రజలు తమ భూసంబంధిత సమస్యలు, రెవెన్యూ సమస్యలను ఈ రెవెన్యూ క్లినిక్ ద్వారా పరిష్కరించుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
Post Comment